1894లో అమెరికా పార్లమెంట్ ఒక చట్టం చేసింది. దాని ప్రకారం ప్రతి ఏడాది సెప్టెంబరులో వచ్చే మొదటి సోమవారం సెలవు ప్రకటించి అమెరికా కార్మికదినంగా పాటించాల్సి ఉంది. అదే ఏడాది అమెరికా రైల్వే కార్మికుల సమ్మెను నిరంకుశంగా అణచివేయటంలో అధ్యక్షుడు క్లీవ్లాండ్ పేరు మోశాడు. ప్రస్తుతం అమెరికాలో యూనియన్లు నామ మాత్రంగా మారాయన్నది ఒక అభిప్రాయం. ఈ కారణంగానే వారి ఆదాయాలు ఏడాదికేడాది పడిపోతున్నాయి, మధ్యతరగతి అంతరిస్తున్నది. 1950దశకంలో మూడో వంతు మంది కార్మికులు ఏదో ఒక యూనియన్లో ఉండే వారు. 1983 నాటికి ప్రయివేటు రంగంలోని కార్మికులు 16.8శాతం మంది యూనియన్లలో ఉండగా గతేడాది అది 6.4శాతానికి పడిపోయింది. ప్రభుత్వరంగంలో 37నుంచి 34శాతానికి తగ్గింది. యూనియన్లకు కార్మికులు ఎప్పుడైతే దూరంగా ఉంటారో అప్పుడు కార్మిక సంఘాల బేరమాడేశక్తి తగ్గుతుంది. 1940 దశకం నుంచి చూస్తే 66శాతం మేరకు యూనియన్ల సభ్యత్వం పడిపోగా ఆర్థిక అసమానతలు 30శాతం వరకు పెరిగాయని ఒక అధ్యయనం తెలిపింది.
అమెరికాలో ఏర్పడిన మహా సంక్షోభ సమయంలో అధికారానికి వచ్చిన డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ తన తొలి పదవీ కాలం 1935లో జాతీయ కార్మిక సంబంధాల చట్టాన్ని తెచ్చారు. దాని ప్రకారం ప్రయివేటురంగంలోని కార్మికులకు యూనియన్ ఏర్పాటు చేసుకొనే హక్కుతో పాటు బేరమాడే, సమ్మె చేసే హక్కులు కూడా సంక్రమించాయి. రెండవసారి అధికారానికి వచ్చిన తరువాత న్యాయమైన కార్మిక ప్రమాణాల పేరుతో మరొక చట్టాన్ని తెచ్చారు. దాన్లో భాగంగానే కనీసవేతన వ్యవస్థ ఏర్పాటు చేశారు. బాలలతో పని చేయించటాన్ని నిషేధించటం, వారానికి నలభై గంటలకు మించి పని చేసిన వారికి ఒకటిన్నర రెట్లు ఓవర్ టైమ్ చెల్లింపులు వచ్చాయి. ఈ కారణంగానే నేటికీ అమెరికాలో ఉన్న మేరకు కార్మిక సంఘాలు ఎక్కువ భాగం డెమోక్రటిక్ పార్టీతోనే ఉంటాయి.
కార్మికులు పైమెరుగులు, నాయకుల దయాదాక్షిణ్యాలను కాదు, తమకు అనుకూలమైన ఆర్థిక వ్యవస్థ దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారని కార్మికదినం సందర్భంగా క్రిస్టియన్ సైన్స్ మానిటర్ పత్రిక నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఎఎఫ్ఎల్-సీఐఓ అధ్యక్షుడు రిచర్డ్ ట్రమ్కా చెప్పారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న అభ్యర్ధులను తాము ఇదే అడుగుతున్నామని అన్నారు. కేవలం వాణిజ్య ఒప్పందాలు కాదు, ఆర్థిక వ్యవస్థలో మార్పులు తెచ్చే కార్యాచరణ కావాలి. యూనియన్ల అవసరం ఉందని గుర్తించిన వారి సంఖ్య 64శాతానికి పెరిగినట్టు గాలప్ పోల్ వెల్లడించింది. అయితే అమెరికా కార్మిక చట్టంలోని లోపాల కారణంగా అది సభ్యత్వంగా మారటం లేదు అన్నారు. గతేడాది సుప్రీం కోర్టు తీర్పు తరువాత ప్రభుత్వరంగంలోని ఉద్యోగులు యూనియన్లలో చేరటం తగ్గొచ్చని భయపడ్డాం. కానీ ఉద్యోగ సంఘంలో రెండు లక్షలమంది, టీచర్స్ యూనియన్లో 88వేలమంది తోడయ్యారని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థులను అడగాల్సి ప్రశ్నల గురించి కార్మిక సంఘాలకు పెద్ద ఎత్తున శిక్షణిస్తామని వెల్లడించారు. స్తంభించిన వేతనాలు, పెన్షన్ల గురించే కాదు ఆరోగ్య సంరక్షణకు చేస్తున్న ఖర్చు, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, అమెరికా ఉద్యోగాలను మెక్సికో, ఇతర చోట్లకు తరలించటం వంటి అనేక అంశాల గురించి పోటీ చేయనున్న అభ్యర్థులను ప్రశ్నిస్తామని అన్నారు. కొత్త ఒప్పందంలో భాగస్వాములు కానున్న అమెరికా, కెనడా, మెక్సికో దేశాలలో కార్మికుల హక్కులు, గౌరవ మర్యాదలను కాపాడాల్సి ఉందని చెప్పారు. గతంలో మెక్సికోలోని అమెరికా కార్పొరేట్ కంపెనీలు ప్రభుత్వ అనుకూల, కంపెనీ అనుకూల యూనియన్లతో ఏడు లక్షల ఒప్పందాల గురించి చర్చించాయని కొత్త ఒప్పందం అమల్లోకి వస్తే నాలుగేండ్లలో వాటిని రద్దు చేసి స్వతంత్ర కార్మిక సంఘాలతో ఒప్పందాలు చేసుకొనే విధంగా చేస్తామనే మెక్సికో ప్రతిన ఎంతమేరకు నెరవేరుతుందో, అక్కడి కార్మికుల వేతనాలు ఎంత మేరకు పెరుగుతాయో అనుమానమే.. అన్నారు. చట్టాలను అమలు జరిపే యంత్రాంగం లేకపోతే అది కార్మికుల పాలిట వినాశకరంగానూ, కార్పొరేట్లకు విపరీత లాభాలకు దారి తీస్తుందని, మెక్సికో నూతన అధ్యక్షుడు ఒబ్రాడర్ కార్మికుల హక్కులను కాపాడతానన్న తన హామీ ఎలా నిలబెట్టుకుంటారో వెల్లడించాలని అన్నారు.
ఇతర దేశాలతో ఎగుమతుల్లో పోటీ పడేందుకు కార్మికులు వేతనాలు తగ్గించుకొని దేశ భక్తి చూపాలని లేకపోతే వున్న ఉద్యోగాలు కూడా ఉండవని బెదిరించిన అమెరికన్ కార్పొరేట్ల వత్తిడికి కార్మికవర్గం తలవంచి వేతన స్తంభనకు అంగీకరించింది. అయినా ఎగుమతులు పెరగలేదు. ఆర్థిక వ్యవస్థలో ఎదుగూ బొదుగూ లేదు. ఈ పూర్వరంగంలోనే చైనా, ఐరోపా యూనియన్ తదితర దేశాలతో ట్రంప్ వాణిజ్య యుద్ధానికి దిగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు ట్రంప్ కార్మికవర్గం మీద మొత్తంగా దాడి కొనసాగిస్తూనే ఉన్నాడు. అనేక సంక్షేమ చర్యలకు కోతపెట్టటం దానిలో భాగమే. పేరుకు అనేక పథకాలున్నప్పటికీ వాటిని పొందాలంటే కార్మికులు ఎంతో నష్టపోవాల్సి ఉంది. మన దేశంలో ఈఎస్ఐ ఆస్పత్రులలో వైద్యం కోసం కార్మికులు ఎన్ని ఇబ్బందులు పడాలో చూస్తున్నదే. కార్మికోద్యమాన్ని బలహీనపరిచేందుకు యూనియన్లను దెబ్బతీస్తున్నారు.
కార్మిక వ్యతిరేకులుగా రుజువైన వారిని కార్మిక మంత్రులుగా నియమించటం వంటి చర్యలకు ట్రంప్ పూనుకున్నాడు. తన సంస్థలలో కార్మిక చట్టాలను ఉల్లంఘించి, కార్మికులను మోసం చేసి విధిలేక మిలియన్ల డాలర్ల మేరకు జరిమానాలు చెల్లించిన ఒకరిని కార్మికమంత్రిగా నియమిస్తే రిపబ్లికన్లు కూడా అంగీకరించలేదు. రెండవ మంత్రి కూడా అలాంటి వ్యక్తే, తాజాగా ప్రతిపాదించిన మూడవ మంత్రి ఇప్పటివరకు చేసిందేమిటయ్యా అంటే వాణిజ్య సంస్థలను సమర్థించటమే పని. ట్రంప్ విషయానికి వస్తే ఎన్నికల్లో చేసిన సామాజిక భద్రత, వైద్యం గురించి వాగ్దానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు. సామాజిక భద్రత యంత్రాంగాన్ని పెద్దఎత్తున తగ్గించి దరఖాస్తుల పరిశీలన తతంగాన్ని ఏండ్ల తరబడి సాగదీస్తున్నారు. మంజూరైన తరువాత కూడా లబ్ది అందుకోవటంలో అనేక ఇబ్బందులు పెడుతున్నారు. ఒక వాణిజ్య, పారిశ్రామికవేత్తగా ట్రంప్ తక్కువ తినలేదు. అధ్యక్షుడిగా ఎన్నికవటానికి ముందు ఏడాదిలో కార్మికులు, ఉద్యోగులను వేధించిన చరిత్ర చాలా ఉంది. పని చేయించుకొని కాంట్రాక్టర్లు, కార్మికులకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకపోవటం, చట్టాల ఉల్లంఘన వంటి వివిధ ఉదంతాలకు సంబంధించి అరవై కేసులను ట్రంప్ సంస్థలు ఎదుర్కొన్నాయి.
అమెరికాలో ఎన్నికల వాతావరణం మొదలైంది గనుక సహజంగానే కార్మికులు ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. ఎనిమిదేండ్ల డెమోక్రటిక్ పార్టీ నేత ఒబామా పాలనలో ఉద్యోగాలను కాపాడటంలో, కొత్త వాటి కల్పనలో దారుణంగా విఫలమయ్యాడు. ఎన్నో వాగ్దానాలతో రిపబ్లికన్ పార్టీకి చెందిన ట్రంప్ జనంలో ఉన్న అసంతృప్తిని సొమ్ము చేసుకున్నాడు. గత మూడేండ్లలో అన్ని రంగాల్లో విఫలమై ఉద్యోగాల రక్షణ, మరొక పేరుతో అనేక వివాదాస్పద ప్రకటనలు చేస్తున్నాడు. చైనా, భారత్ వంటి దేశాలతో బలవంతంగా అధికరేట్లకు తమ సరుకులు కొనాలని వత్తిడి, ప్రతి చర్యలకు దిగుతున్నాడు. డెమోక్రటిక్ పార్టీ తరఫున ఎలిజబెత్ వారెన్, బెర్నీ శాండర్స్తో పాటు మరికొందరు అధ్యక్ష పదవి అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతూ తాము అధికారానికి వస్తే ఏం చేయనున్నారో వెల్లడిస్తున్నారు. వాటిలో కొన్ని ఇలా వున్నాయి.
గంటకు పదిహేను డాలర్ల కనీస వేతనం ఇవ్వాలన్న ప్రతిపాదనకు డెమోక్రటిక్ పార్టీనేతలు మద్దతు తెలుపుతున్నారు. అంతేకాదు కొన్ని ఐరోపా దేశాల్లో మాదిరి కార్పొరేట్ డైరెక్టర్ల బోర్డుల్లో కార్మిక ప్రతినిధులకు చోటు కల్పించాలన్న ప్రతిపాదనలను కూడా చేస్తున్నవారు లేకపోలేదు. జవాబుదారీ పెట్టుబడిదారీ బిల్లు ప్రతిపాదన వాటిలో ఒకటి. దాని ప్రకారం డైరెక్టర్లుగా 40శాతం మంది కార్మికుల నుంచి ఎన్నుకోవాల్సి ఉంటుంది. జర్మనీలో కొన్ని పరిశ్రమల్లో సగం మంది వరకు డైరెక్టర్లు కార్మికుల నుంచి ఉన్నారు. పని స్థలాల్లో ప్రజాస్వామ్యం పేరుతో గత ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధిత్వం కోసం పోటీ పడిన, మరోసారి అదే ప్రయత్నం చేస్తున్న బెర్నీ శాండర్స్ కూడా కొన్ని ప్రతిపాదనలను ముందుకు తెచ్చారు. బ్రిటన్లోని బడా పరిశ్రమల్లో వచ్చిన లాభాల్లో పదిశాతం వాటాల వరకు వచ్చిన మొత్తాన్ని కార్మిక నిధులకు జమ చేస్తారు. ప్రతి ఏటా కార్మికులు 600పౌండ్ల డివిడెండ్ పొందుతారు. ఇలాంటి అంశాలను చర్చకు తెస్తున్నారు.
కార్మికోద్యమాన్ని నిర్మించకుండా అమెరికాలో మధ్యతరగతి పెరిగే అవకాశాలు లేవని బెర్నీ శాండర్స్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అధికారాలన్నీ యజమానులు, బడా కార్పొరేట్ల చేతుల్లో ఉన్నాయి, యూనియన్లు లేకుండా వేతనాలు, ఇతర లబ్ది పొందటం అసాధ్యం అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. మౌలికంగా వీటి స్వభావం సంస్కరణలు తప్ప మౌలిక మార్పులను కోరేవి కాదు. అమెరికాలో ఇప్పుడున్న వాతావరణంలో ఆ పెట్టుబడిదారీ సంస్కరణల మీద కూడా దాడి జరుగుతున్నది, కనీసం వాటిని రక్షించుకొనే స్థితిలో కూడా కార్మికవర్గం లేదని గమనించాలి.