దేశవ్యాప్తంగా 92 శాతం మంది వలస కార్మికులకు జీతాల్లేవు
ఊరెళ్లేందుకు డబ్బు లేక అవస్థలు
స్టాండెడ్ వర్కర్స్ అసోసియేషన్ నెట్వర్క్ వెల్లడి
64 శాతం- చేతిలో రూ.100 కన్నా తక్కువ మొత్తం ఉన్న కార్మికులు
70 శాతం- ఒకరోజుకీ సరిపడే రేషన్ లేనివారు
93శాతం- ప్రభుత్వం నుంచి రేషన్ అందనివారు
97శాతం- సర్కారు నుంచి ఎలాంటి సహాయం పొందనివారు
ఇదీ దేశవ్యాప్తంగా వలస కార్మికుల ప్రస్తుత పరిస్థితి.కరోనా నేపథ్యంలో వారి స్థితిగతులపై స్టాండెడ్ వర్కర్స్ అసోసియేషన్ నెట్వర్క్ అధ్యయనం చేసింది. వారి జీవితాలు ఎంత దుర్భరంగా ఉన్నాయో ఆవిష్కరించింది. వారి వేదనను తెలియజేసింది.
హైదరాబాద్ : కరోనా కష్టకాలంలో వలస కార్మికులకు కన్నీళ్లు తప్పడం లేదు. దాదాపు 92 శాతం మంది వలస కూలీలకు యాజమాన్యాలు జీతాలు, కూలి చెల్లించలేదని స్టాండెడ్ వర్కర్స్ అసోసియేషన్ నెట్వర్క్ అధ్యయనంలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా కార్మికుల కష్టాలు, సమస్యలను అధ్యయనం చేస్తున్న ఈ సంస్థ పలు విషయాలు ప్రకటించింది. కార్మికులపై బ్యాంకులూ పడ్డాయి. ఖాతాల్లో కనీస నిల్వ లేదంటూ జరిమానాలు విధించాయంది. గరిష్ఠంగా బ్యాంకులు రూ.499 వరకు ఛార్జీలు వేశాయి. సొంత గ్రామాలకు చేరుకునేందుకు చాలాచోట్ల కార్మికులు తెలిసిన బంధువులు, స్నేహితుల ద్వారా అప్పు కింద స్వల్ప మొత్తాలు తీసుకుంటున్నారు. మరికొందరు కాలినడకన పయనమవుతున్నారు.
అప్పటివరకు కూడబెట్టిన డబ్బు… లాక్డౌన్లో పనులు లేకపోవడంతో తినడానికి ఖర్చయ్యాయి. సొంత గ్రామాలకు వెళ్లేందుకు 78 శాతం మందికి సరిపడా డబ్బులేదని అధ్యయనం వెల్లడించింది. ఇంటికి వెళ్తే అప్పుల బాధలు పెరుగుతాయని, ఇక్కడే ఉండి డబ్బు సంపాదించాకనే వెళ్లాలని మరికొందరు భావిస్తున్నారు. లాక్డౌన్ ముగిశాక పాత యజమానుల వద్ద పనిచేస్తామని 30 శాతం మంది వివరించారు. మరో 30 శాతం మంది ఏమి చేయాలన్న విషయమై నిర్ణయించుకోలేదని అధ్యయనం తెలిపింది. స్వస్థలాలకు వెళ్లిన తరువాత అక్కడే ఏదో ఒక పనిచేసుకుని బతకాలని 16 శాతం మంది భావిస్తున్నారు. ఒకేదేశం-ఒకేకార్డు విధానం లేకపోవడంతో వలస కార్మికులకు ప్రభుత్వం నుంచి రేషన్ అందలేదని సర్వే వివరించింది.
పునరావాస కేంద్రాలు కొనసాగించాలి
వలస కార్మికుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలు కొనసాగించాలని అధ్యయన సంస్థ సూచించింది. వారికి మూడునెలలు ఉచిత రేషన్ అందించాలని, పప్పులు, నూనె, ఉప్పు, మసాలా, సబ్బులు, శానిటరీ నాప్కిన్స్ సరఫరా చేయాలని పేర్కొంది. లాక్డౌన్ తర్వాత కూడా 12 గంటలు ఆహార కేంద్రాలు కొనసాగించాలంది. కార్మికులకు వేతన పరిహారం కల్పించాలని కోరింది.
Courtesy Eenadu