ఎన్నికల సంఘానికి రాజకీయ పార్టీల నివేదిక
దిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి విరాళాలు వెల్లువలా వచ్చిపడ్డాయి. కేంద్ర ఎన్నికల సంఘం నివేదిక ప్రకారం 2019-20 సంవత్సరానికి గానూ భాపాకు ఏకంగా రూ.785.77 కోట్లు విరాళంగా వచ్చాయి. అదే సమయంలో కాంగ్రెస్కు రూ.139 కోట్లు విరాళాలు వచ్చినట్లు పేర్కొంది. కాంగ్రెస్తో పోలిస్తే భారతీయ జనతా పార్టీకి దాదాపు ఐదురెట్లు ఎక్కువగా విరాళాలు రావడం గమనార్హం.
తమకు వచ్చే విరాళాల గురించి రాజకీయ పార్టీలు ఏటా కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తాయి. ఇందులో భాగంగా 2019-2020 ఆర్థిక సంవత్సరానికి రూ.785 కోట్లు విరాళంగా వచ్చినట్లు ఎన్నికల సంఘానికి సమర్పించిన నివేదికలో భాజపా వెల్లడించింది. వీటిలో ఎక్కువగా పార్టీ నేతలు, కార్పొరేట్ సంస్థలు, ఎలక్టోరల్ ట్రస్టుల ద్వారానే వచ్చాయి. పీయూష్ గోయల్, పెమా ఖాండూ, కిరోణ్ ఖేర్, రమణ్ సింగ్ వంటి పార్టీ నేతలు భాజపాకు విరాళాలు ఇచ్చిన వారిలో ముందున్నారు. ఇక ఐటీసీ, కల్యాణ్ జ్యువెల్లర్స్, రేర్ ఎంటెర్ప్రైజెస్, అంబుజా సిమెంట్, లోధా డెవలపర్స్, మోతీలాల్ ఓస్వాల్ వంటి కార్పొరేట్ సంస్థలూ భాజపాకు నిధులు సమకూర్చాయి. కాంగ్రెస్ పార్టీకి మొత్తంగా రూ.139 కోట్ల విరాళాలు వచ్చినట్లు ఎన్నికల సంఘానికి తెలిపింది. ఎన్సీపీ రూ.59 కోట్లు, సీపీఐ(ఎం) రూ.19.7కోట్లు, తృణమూల్ కాంగ్రెస్ రూ.8 కోట్లు, సీపీఐ రూ.1.3 కోట్లు విరాళంగా అందుకున్నట్లు వెల్లడించాయి.
Courtesy Eenadu