- పెట్రోల్పోసి నిప్పంటించిన బావ
- ఆమెనూ పెళ్లాడతానంటూ
- ఆరు నెలల నుంచి వేధింపులు
- ఒప్పించాలని భార్యపై ఒత్తిడి
- వేరేవారితో పెళ్లి ఖరారుతో ఘాతుకం
- మూగజీవాలపైనా విష ప్రయోగం
- 2 కుక్కలు, పిల్లి, 30 కోళ్లూ మృతి
- చిత్తూరు జిల్లాలో దారుణం
ములకలచెరువు : భార్య ఉన్నప్పటికీ.. మరదలిపై కన్నేశాడు. ఆమెనూ సొంతం చేసుకోవాలనుకున్నా డు. అయితే, మరొకరితో పెళ్లి నిశ్చయమవడంతో అక్కసుతో రగిలిపోయాడు. నిద్రిస్తుండగా పెట్రోల్పోసి నిప్పంటించాడు. చిత్తూరు జిల్లాలో గురువారం చోటుచేసుకుందీ దారుణం. పోలీసుల కథనం మేరకు.. ములకలచెరువు మండలం సోంపల్లె పంచాయతీ గట్టుకిందపల్లెకు చెందిన కదిరి శివన్న, నరసమ్మ దంపతులకు అరుణ, మాధవి, సుమతి కుమార్తెలు. చిన్న కుమార్తె సుమతి(24) మదనపల్లెలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఆమెకు మదనపల్లె మండలం చీకలబైలు పంచాయతీ జవకలపల్లెకు చెందిన ఓ యువకుడితో ఈ నెల 25న వివాహం జరగాల్సి ఉంది. ఈ క్రమంలో బుధవారం రాత్రి వరకు ఇంటికి రంగులు వేశారు.
ఈ క్రమంలో.. వరండాలో నిద్రిస్తున్న సుమతిపై గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో రెండో అక్క భర్త వెంకటేశ్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మంటలు భరించలేక ఆమె హాహాకారాలు చేస్తూ పశువులు నీళ్లుతాగే తొట్టెలోకి దూకొంది. ఈ లోగా ఇంటికి కాపలాగా ఉన్న రెండు కుక్కలు, ఇంటి వెనుక కుక్క చనిపోవడాన్ని కూడా స్థానికులు గుర్తించారు. నిందితుడు అన్నంలో విషం కలిపి కుక్కలకు పెట్టడంతో వాటితోపాటు ఒక పిల్లి చనిపోయాయి. తెల్లవారాక ఆ విషాహారం తిన్న 30 కోళ్లు మృతి చెందాయి. బాధితురాలిని తొలుత మదనపల్లె జిల్లా ఆస్పత్రికి, తర్వాత తిరుపతి రుయాస్పత్రికి పంపారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
పెళ్లి కుదిరిందని తెలిసి…
వెంకటే్షది కర్ణాటక రాష్ట్రం బేగూరు. తొమ్మిదేళ్ల కిందట మాధవితో వివాహమైంది. మూడేళ్లపాటు ఇల్లరికం వచ్చాడు. తర్వాత ములకలచెరువులోని రాగిమానిపల్లెకి కాపురం మార్చాడు. చాన్నాళ్ల నుంచి.. సుమతిని రెండో పెళ్లి చేసుకుంటానని భార్య మాధవితో గొడవపడేవాడు. సుమతిని తనకిచ్చి పెళ్లి చేయాలని అత్తమామలను అడగ్గా.. వారూ నిరాకరించారు. బావ వేధింపులు భరించలేక ఆరు నెలల కిందట సుమతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. అప్పట్లో మదనపల్లె టూటౌన్ పోలీసులు వెంకటేష్కు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో మరదలికి వేరే వ్యక్తితో పెళ్లి కుదిరిందని తెలియడంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైందని పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు.
Couretesy Andhrajyothi