‘పౌరసత్వ తుట్టె’ కదిలింది !

0
206
  • మూడు దేశాల నుంచి వచ్చిన వారికి పౌరసత్వం
  • 13 జిల్లాల కలెక్టర్లకు అధికారం
  • గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన కేంద్రం
  • కరోనా వైఫల్యం నుంచి పక్కదారి పట్టించేందుకే !

న్యూఢిల్లీ : ఒకవైపు కరోనా వైరస్‌ మహమ్మారి కల్లోలంతో దేశం అల్లాడిపోతుంటే, కేంద్రంలోని మోడీ సర్కార్‌ మరోసారి ‘పౌరసత్వ’ తుట్టెను కదిపింది. పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ నుంచి వలస వచ్చిన ముస్లిం, క్రిస్టియన్‌ మతాలకు చెందని వారికి పౌరసత్వ సర్టిఫికెట్లు జారీ చేసేందుకు ప్రభుత్వం మరో 13 జిల్లాల కలెక్టర్లకు అధికారం ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ శుక్రవారం ఒక నోటిఫికేషన్‌ జారీ చేసింది. 2019లో కేంద్ర ప్రభుత్వం ఆమోదింపజేసుకున్న వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ) నియమాలు రూపకల్పన ఇంకా పూర్తి కాని నేపథ్యంలో 1955 పౌరసత్వ చట్టం, పౌరసత్వ నియమాలు-2019 ప్రకారం తాజా గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చినట్లు హోంశాఖ వర్గాలు తెలిపాయి.

పౌరసత్వం జారీ విషయలో కేంద్ర ప్రభుత్వం ఇంత హుడావుడిగా నోటిఫికేషన్‌ విడుదల చేయడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా వ్యాప్తి కట్టడి, వ్యాక్సిన్ల కొరత, తదితర అంశాల్లో ఘోర వైఫల్యం చెందిన మోడీ సర్కార్‌.. ఇప్పుడు దాని నుంచి దేశ ప్రజలను పక్కదారి పట్టించేందుకు ఈ విధమైన అకస్మాత్తు నిర్ణయాన్ని ముందుకు తెచ్చినట్లు తెలుస్తోంది. తాజా నోటిఫికేషన్‌పై మీడియాలో విపరీతమైన ప్రచారం ముందుకు వస్తే.. కరోనా వైఫల్యాన్ని పక్కకు తప్పించాలని కేంద్రం ప్రయత్నిస్తోందని విమర్శకులు పేర్కొంటున్నారు.

కేంద్రం తన తాజా నోటిఫికేషన్‌లో పాకిస్తాన్‌, అఫ్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ నుంచి వలస వచ్చిన, ఆయా దేశాల్లో మైనార్టీలైన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రిస్టియన్ల మతాలను పేర్కొంది. ఆయా మతాలకు చెందిన వారి నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించి, పరిశీలించడంతో పాటు పౌరసత్వ సర్టిఫికెట్లు జారీ చేయాలని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ తాజా నోఫికేషన్‌లో గుజరాత్‌లోని వడోదర, పఠాన్‌, రాజ్‌కోట్‌, మోర్బి, చత్తీస్‌గడ్‌లోని దుర్గ్‌, బలోదాబజార్‌, రాజస్తాన్‌లోని జలోర్‌, ఉదరుపూర్‌, పాలి, బార్మర్‌, సిరోహి, అదేవిధంగా హర్యానాలోని ఫరీదాబాద్‌, పంజాబ్‌లోని జలంధర్‌ జిల్లాల కలెక్టర్లకు ఈ అధికారం ఇచ్చింది. ఇటువంటి వలసదారులు అధికంగా కేంద్రీకృతమైన జిల్లాలు ఇవి. ఇదే విధమైన నోటిఫికేషన్‌ను కేంద్ర ప్రభుత్వం 2016, 2018లలో కూడా వివిధ రాష్ట్రాలోని పలు జిల్లాల కలెక్టర్లకు ఇవ్వడం గమనార్హం. పౌరసత్వ చట్టం-1955లోని సెక్షన్‌ 5,6ల ప్రకారం పౌరసత్వం కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న ఆయా మతాలకు చెందిన వారికి లబ్ధి చేకూర్చడమే ఈ నోటిఫికేషన్‌ ముఖ్య ఉద్దేశంగా ఉంది. దరఖాస్తుదారులు ఆన్‌లైన్‌ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుందని, కేంద్ర సంస్థలు, రాష్ట్ర పోలీసుల భద్రతా తనిఖీ తర్వాత వారికి పౌరసత్వ సర్టిఫికెట్‌ ఇవ్వడం జరుగుతుందని కేంద్రహోంశాఖ తన నోటిఫికేషన్‌లో తెలిపింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నియమాల ప్రకారం 2009, డిసెంబర్‌ 31కి ముందు భారత్‌లోకి ప్రవేశించిన మూడు దేశాలకు చెందిన మైనార్టీ మతస్తులు తమ దరఖాస్తు సమయంలో పాస్‌పోర్టు కాపీని కచ్చితంగా సబ్మిట్‌ చేయాల్సిన అవసరం లేదు. వీసా తేదీ ఇచ్చి.. పాస్‌పోర్టు స్థానంలో వీసా పత్రాన్ని అప్‌లోడ్‌ చేస్తే సరిపోతుంది. పౌరసత్వ సవరణ చట్టం 2019లో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ఆమోదింపజేసుకుంది. ఈ చట్టం నియమాలు కేంద్ర ప్రభుత్వం ఇంకా రూపొందించలేదు. అంతకుముందు చట్టం ప్రకారం పైన పేర్కొన్న మూడు దేశాల నుంచి వలస వచ్చిన మైనార్టీ మతస్తులకు పౌరసత్వం ఇవ్వాలంటే 11 ఏళ్లుగా భారత్‌లో స్థిరనివాసం ఉండాలి. ఆ విధంగా 2014లో వచ్చిన ఎవరైనా పౌరసత్వం పొందాలంటే 2025 వరకు వేచివుండాల్సి ఉంది. అయితే ఇప్పటికే 20 ఏళ్ల దీర్ఘకాల వీసా(ఎల్‌టివి)పై అనేక మంది భారత్‌లో నివసిస్తున్నారు. ఈ ఎల్‌టివి అనేది పౌరసత్వం పొందేందుకు ఉపయోగపడుతుంది.

కొత్త చట్టం ప్రకారం 2014, డిసెంబర్‌ 31 నాటికల్లా భారత్‌కు వచ్చి స్థిరపడ్డవారు పౌరసత్వ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కేంద్రం తెలిపింది. అయితే పాక్‌, అఫ్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ నుంచి వివిధ కారణాలతో భారత్‌కు వలస వచ్చిన ముస్లిములకు మాత్రం మోడీ సర్కార్‌ ఈ పౌరసత్వ అవకాశం కల్పించడంలేదు.

ఇది దగా
”పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ)-2019 కింద ఇంకా నియమాల రూప కల్పన జరగకుండానే, ఆ చట్టాన్ని ఆమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సిఎఎ రాజ్యాంగ ప్రామాణికతను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. సుప్రీంకోర్టు వెంటనే దీనిపై స్పందించి, ఈ బ్యాక్‌డోర్‌ అమలును నిలిపివేస్తుందని ఆశిస్తున్నాం.”
సీతారాం ఏచూరి, సిపిఎం ప్రధాన కార్యదర్శి

Courtesy prajashakti

Leave a Reply