చైనా, ఇరాన్ లో కరోనా మరణాలు

0
267

ఎన్ని చర్యలు చేపట్టినా కరోనా వైరస్‌ (కోవిడ్-19) మరణాలు ఆగడం లేదు. ముఖ్యంగా చైనా, ఇరాన్‌ దేశాల్లో కరోనా వైరస్ కల్లోలం కొనసాగుతోంది.

బీజింగ్: చైనాలో ఆదివారం కరోనా బాధితులు మరో 27 మంది మృతి చెందడంతో కోవిడ్ వ్యాప్తి ఆగడం లేదని రుజువవుతోంది. ఈ 27 మరణాలు సెంట్రల్ హుబెయ్ ప్రావిన్సు లోనే సంభవించాయని నేషనల్ హెల్త్ కమిషన్ ప్రకటించింది. అయితే నెల రోజుల వ్యవధిలో మరణాల సంఖ్య ఈ విధంగా తగ్గడం ఇది మొదటిసారి కావడం గమనార్హం. ఇప్పటివరకు ఈ మహమ్మారి బారిన పడి చైనాలో 3097 మంది ప్రాణాలు కోల్పోయారు. కోలుకున్న వారిలో 57,065 మంది డిశ్చార్జి కాగా, ఇంకా 20500 మంది చికిత్స పొందుతున్నట్టు సమాచారం. మొత్తం 93 దేశాల నుంచి 21,114 కరోనా కేసులు నిర్ధారణ అయినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ శనివారం వెల్లడించింది.

చైనా తర్వాత ఎక్కువగా కరోనా కాటుకు గురైన ఇరాన్‌నూ కరోనా వైరస్‌ వణికిస్తోంది. గడిచిన 24 గంటల్లోనే ఏకంగా 49 మంది మృతి చెందినట్లు ఇరాన్ అధికారులు వెల్లడించారు. కోవిడ్-19 సోకడంతో ఇప్పటివరకు ఇరాన్ లో 194 మంది మృతి చెందారు. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు ఫతేమహ్ రహబర్ వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయినట్టు ఇరాన్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. టెహ్రాన్ పార్లమెంట్ స్థానం నుంచి ఫతేమహ్ రహబార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Leave a Reply