కుర్చీపై సర్పంచ్‌.. నేలపై ఎంపీటీసీ..

0
288

పరిపూర్ణం
ఈ ఫొోటోలోని వృత్తంలో కనిపిస్తున్న మహిళ ఎంపీటీసీ. పక్కనే కుర్చీలో కూర్చున్న మహిళ సర్పంచ్‌. ఇంకొకరు గ్రామ కార్యదర్శి, మరొకరు ప్రత్యేకాధికారి. సర్పంచ్‌, ఎంపీటీసీ ఇద్దరూ ప్రజల చేత ఎన్నుకోబడినవారే. పైగా అధికార పార్టీకి చెందినవారు. మరి ఈ వ్యత్యాసమెందుకంటే ఎంపీటీసీ దళితురాలు. సర్పంచ్‌ ఆధిపత్య కులస్తురాలు. అందుకే ఎంపీటీసీని వేదికపై కింద కూర్చొబెట్టారు. నారా యణపేట జిల్లాలో 30 రోజుల ప్రణాళికలో అధికారుల సాక్షిగా ఈ ఘటన జరిగినా ఉన్నతాధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల ద్వారా దళితులు ప్రజా ప్రతినిధులైనా వారి గౌరవానికి కులం అడ్డుగా నిలిచిందంటే దళితులపై ఎంతటి వివక్ష కొనసాగుతోందో అర్థం చేసుకోవచ్చు.
మద్దూరు మండలం పెదిరపాడు గ్రామానికి చెందిన దళిత ప్రజాప్రతినిధి సర్పంచ్‌ బాలప్పను కింద కూర్చోబెట్టి కుర్చీ మీద భూస్వామి వెంకట్‌రెడ్డి కూర్చొని తీర్పు ఇచ్చి దళిత సర్పంచ్‌ని అవమాన పరిచాడు. ఈ ఘటన మరవక ముందే నర్వ మండలంలో కులవివక్ష కోరలు చాచింది. ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన ’30 రోజుల ప్రణాళిక’ కోసం ఈ నెల14న పెద్దకడ్మూరు గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామ సర్పంచ్‌ శశిరేఖ, ఎంపీటీసీ రాధమ్మ, కార్యదర్శి షర్పొద్దీన్‌, ప్రత్యేకాధికారి అమర్‌నాథ్‌రెడ్డి, వీఆర్వో భీమయ్య, వార్డు సభ్యులూ హాజరయ్యారు. కానీ ప్రణా ళిక తయారు చేసేటప్పుడు ఆధిపత్య కులస్తురాలైన సర్పంచ్‌కు కుర్చీ వేసి, దళిత ఎంపీటీసీ రాధమ్మను కింద కూర్చోబెట్టారు. ఇదే సామాజికవర్గానికి చెందిన గోవింద్‌ను కూడా నేలపై కూర్చోబెట్టారు. సర్పంచ్‌ మాటను గ్రామంలో ఎవరూ ధిక్కరించరని, తాను దళితురాలైనందునే నేలపై కూర్చొబెట్టారని బాధితురాలు వాపోయింది.
దాడులు..అవమానాలు…
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. అయినా అధికారులు, ప్రజాప్రతినిధులు ఏమాత్రం పట్టించుకోకపోవడంవల్లే ఇలాంటి పరిస్థితులు పునరావృతమౌతున్నాయి. రెండు రోజుల క్రితం నాగర్‌కర్నూల్‌ జిల్లా తెలకపల్లి మండలం నడిగడ్డ గ్రామంలో 30 రోజుల ప్రణాళికపై సభ నిర్వహించారు. సమావేశానికి ప్రత్యేకాధికారితోపాటు పంచా యతీ కార్యదర్శి, సర్పంచ్‌ ఈశ్వరయ్య, ఉప సర్పంచ్‌ బస్వారెడ్డి హాజరయ్యారు. ఉప సర్పంచ్‌ కూర్చున్న కుర్చీని దళితుడు పట్టుకున్నాడని అతనిపై దాడి చేశారు. ఇదే విషయమై ఫిర్యాదు చేయగా నాన్చుడు ధోరణి అవలంబించి అట్రాసిటీ నమోదు చేశారు. అదే గ్రామంలో వినాయకుడి ఊరేగింపులో పాల్గొన్న బీసీ సామాజిక వర్గానికి చెందిన శ్రీశైలం అనే యువకుడిని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొందరు దాడి చేసి గాయపరిచారు. నాగర్‌కర్నూల్‌లో దళితులు హమాలీ పనులు చేయకుండా అడ్డుకున్నారు. అధికార పార్టీ అండతో కొంతమంది చేత పోటీ సంఘం కూడా పెట్టించారు. గులాబీ కండువా కప్పు కుంటేనే పని కల్పిస్తామని చెప్పడంతో బాధితులు నిరాహార దీక్షలకు దిగారు. బిజినేపల్లి మండలం గుడ్ల నర్వ గ్రామంలో దళితులు మరుగుదొడ్లు నిర్మించుకోలేదని ‘మీజాతి ఇంతే మీరు ఇక బాగుపడరు’ అని పంచాయతీ కార్యదర్శి బాలమణి దూషిస్తూ మండిపడారు. ‘ఇదేంటి దళితులంటే మీకు అలుసా’ అంటూ మాజీ సర్పంచ్‌ రాంచందర్‌ అడ్డొస్తే… అతనిపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వివక్షలు, వేధింపులు, దాడులు ఉమ్మడి పాలమూరు జిల్లాలో నిత్యం సర్వసాధరణమయ్యాయి. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.

వివక్ష నిజమే..
30రోజుల ప్రణాళికలో దళిత మహిళనైన నన్ను కింద కూర్చోబెట్టారు. ఆధిపత్య కులానికి చెందిన సర్పంచ్‌ శశిరేఖను కుర్చీలో కూర్చోబెట్టడం నన్ను చలింపజేసింది. ప్రజల చేత ఎన్నుకోబడిన ఇరువురికి సమాన గౌరవం లేకపోవడం బాధాకరం. అది ప్రభుత్వ కార్యాలయంలో అధికారుల సమక్షంలో జరగడం మరింత బాధాకరం.
– రాధమ్మ, ఎంపీటీసీ, పెద్ద కడ్మూరు, నర్వ మండలం

చట్టానికి ఎవరూ అతీతులు కాదు
నిజానికి నర్వ మండలం పెద్ద కడ్మూరులో జరిగిన ఘటన బాధాకరమే. మేము సభను సజావుగా జరపాలని ఆదేశిచ్చాం. అక్కడ గ్రామ కార్యదర్శి నిర్వహణ లోపంతో దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళ రాధమ్మకు అవమానం జరగింది. ఈ విషయంపై సంజాయిషీ ఇవ్వాలని కార్యదర్శిని ఆదేశించాం.
– రమేష్‌, ఎంపీడీఓ, నర్వ మండలం

Courtesy Navatelangana..

Leave a Reply