– తమిళనాడులో ఘటన
చెన్నై: తమిళనాడులో దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. తాము నిత్యం నడిచే దారికి సమీపంలో మూత్ర విసర్జన చేస్తున్నాడనే కారణంతో.. ఓ దళిత యువకుడిని మరో వర్గానికి చెందిన పలువురు కొట్టి చంపారు. ఈ నెల 12న చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మూకదాడితో ప్రమేయం ఉన్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. వారిపై కేసు నమోదు చేశారు. పోలీ సుల వివరాల ప్రకారం.. విల్లుపురం జిల్లా కరై గ్రామంలో ఆర్.శక్తివేల్ తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. స్థానికంగా ఓ పెట్రోల్ బంకులో పని చేస్తున్నాడు. అతను పనిచేసే పెట్రోల్ బంకు సమీపంలో ఎస్ పుధూర్ గ్రామ ఉంది. పెట్రోల్ బంకు ఆనుకునే ఈ గ్రామానికి వెళ్లే దారి ఉండటం వల్ల శక్తివేల్ ఆ మార్గంలో మూత్ర విసర్జనకు వెళ్తుండే వాడు. ఈ నెల 12న కూడా బహరంగ మూత్ర విసర్జన చేస్తోన్న శక్తివేల్ను గమనించిన పలువురు.. అతనిపై మూకుమ్మడిగా దాడి చేశారు. చేతులు, కాళ్లు కట్టేసి తీవ్రంగా కొట్టారు.
వారి దెబ్బలకు తట్టుకోలేక అతను ప్రాణాలను వదిలాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీన్ని దాచి పెట్టడానికి పుధూర్ గ్రామసులు ఎంతగా ప్రయత్నించినప్పటికీ.. ఫలితం లేకుండా పోయింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో పెరియత్ అచ్చుర్ పోలీసులు రంగంలోకి దిగారు. శక్తివేల్పై దాడి చేసిన కొందరు గ్రామస్తులను అరెస్టు చేశారు. అరెస్టయిన వారంతా వన్నియర్ సామాజిక వర్గానికి చెందిన వారని పెరియత్ అచ్చుర్ ఎస్ఐ కే వినోద్ రాజ్ తెలిపారు. ఫుధూర్ గ్రామానికి చెందిన గౌరి, రాజాలను ప్రధాన నిందితులుగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. మరికొంత మంది పరారీలో ఉన్నారని వెల్లడించారు.
Courtesy Nava Telangana