- ఏడుగురు సభ్యుల బృందానికి మేరీకోమ్ నేతృత్వం
- నియమించిన ఐఓఏ
- న్యాయం జరుగుతుందని పీటీ ఉష హామీ
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎ్ఫఐ) అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా దేశ మేటి రెజ్లర్లు మూడు రోజులుగా జంతర్మంతర్ వద్ద చేస్తున్న ఆందోళనకు..భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) దిగొచ్చింది. మహిళా రెజ్లర్లను బ్రిజ్భూషణ్ లైంగికంగా వేధిస్తున్నాడన్న ఆరోపణలపై విచారణకు ఏడుగురు సభ్యులతో కమిటీని నియమిస్తూ శుక్రవారం రాత్రి నిర్ణయం తీసుకుంది. దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ ఆధ్వర్యంలోని ఈ కమిటీలో మాజీ ఆర్చర్ డోలా బెనర్జీ, మాజీ షట్లర్ అలకానంద అశోక్, ఒలింపియన్ రెజ్లర్ యోగేశ్వర్ దత్, భారత వెయిట్లిఫ్టింగ్ సమాఖ్య అధ్యక్షుడు సహదేవ్ యాదవ్, ఇద్దరు న్యాయవాదులు తలీష్ రే, శ్లోక్చంద్ర ఉన్నారు. అంతకుముందు ఒలింపిక్ పతక విజేతలు బజ్రంగ్ పూనియా, సాక్షి మాలిక్, ప్రపంచ చాంపియన్షి్ప పతక విజేత వినేశ్ ఫొగట్, రవి దహియా తదితర రెజ్లరు ఐఓఏతో భేటీ అయ్యారు. బ్రిజ్భూషణ్ లైంగిక వేధింపుల వ్యవహారంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అనంతరం ఐఓఏ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అత్యవసరంగా సమావేశమైంది. ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష, సంయుక్త కార్యదర్శి కళ్యాణ్ చౌబె, అభినవ్ బింద్రా, యోగేశ్వర్ దత్ తదిరులు సమావేశంలో పాల్గొన్నారు.
వారికి ప్రమాదం..
లైంగిక వేధింపులు ఎదుర్కొన్న రెజర్ల పేర్లు వెల్లడిస్తే వారి జీవితం ప్రమాదంలో పడుతుందని వినేశ్ ఫొగట్ చెప్పింది. తమ సమస్యకు పరిష్కారం కనుగొనకపోతే.. జంతర్ మంతర్లోనే మ్యాట్ వేసుకొని రెజ్లింగ్ ప్రాక్టీస్ చేస్తామని హెచ్చరించింది. ఇక.. రెజ్లర్లు శుక్రవారం రాత్రి క్రీడామంత్రి అనురాగ్ ఠాకూర్తో సమావేశమయ్యారు.
అథ్లెట్ల శ్రేయస్సే లక్ష్యం
‘ఐఓఏ చీఫ్గా..రెజ్లర్ల ఆందోళన విషయమై సభ్యులతో చర్చిస్తున్నా. అథ్లెట్ల శ్రేయస్సే ఐఓఏ ప్రధాన కర్తవ్యం. రెజ్లర్లు ముందుకొచ్చి వారి సమస్యలు తెలియజేయాలి. న్యాయం జరిగేలా దర్యాప్తు సాగుతుంది. భవిష్యత్లో ఇలాంటి పరిస్థితులు ఎదురైతే ఎదుర్కోవడానికి ఓ ప్రత్యేక కమిటీని నియమించాలని నిర్ణయించాం’ అని ఉష ట్వీట్ చేసింది.
విజేందర్… దిగిపో
ఒలింపిక్ బాక్సింగ్ పతక విజేత, కాంగ్రెస్ నాయకుడు విజేందర్ సింగ్ రెజ్లర్లకు మద్దతుగా జంతర్ మంతర్ వెళ్లి శిబిరంలో కూర్చున్నాడు. అయితే విజేందర్ను వేదిక దిగి సాధారణ ప్రజల్లోకి వెళ్లి కూర్చోవాల్సిందిగా ధర్నాలో ఉన్న రెజ్లర్లు కోరారు. గురువారం సీపీఎం నేత బృందా కారత్ వచ్చినప్పుడు ఆమెను కూడా వేదిక దిగిపోవాల్సిం దిగా కోరారు. తమ నిరసనను రాజకీయాలకు దూరంగా ఉంచాలని రెజ్లర్లు భావిస్తున్నారు.