- శివలింగం బయటపడితే మాది.. శవాలు కనిపిస్తే మీది
- అసదుద్దీన్కు బండి సంజయ్ సవాల్.. బీజేపీ గెలిచాక మదర్సాలు రద్దు
- ఉర్దూను శాశ్వతంగా తొలగిస్తాం.. మైనారిటీ రిజర్వేషన్లనూ రద్దు చేస్తాం
- లవ్ జిహాదీ అంటే లాఠీ ఝుళిపిస్తాం.. మత మార్పిడులు చేస్తే సహించం
- రాష్ట్రానికి పట్టిన శనిని కడిగేస్తాం.. రజాకార్ల ఫైల్స్ సినిమా రాబోతోంది
- నన్ను చంపేందుకు యత్నించినా కాషాయాన్ని వీడలేదు
- హిందూ ఏక్తా యాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
కరీంనగర్ : ‘‘దేశంలో 36 వేల ఆలయాలను ధ్వంసం చేసి మసీదులను కట్టారు. ఏ మసీదును తవ్వినా శివలింగాలు బయటపడుతున్నాయి. కాశీలోని మసీదులోనూ ఇదే జరిగింది. తెలంగాణలోనూ మసీదులను తవ్వితే శివలింగాలు కనిపిస్తాయి. ఆ తవ్వకాల్లో శివలింగం కనిపిస్తే ఆ ప్రాంతం మాది (హిందువులది). శవాలు కనిపిస్తే మీది (ముస్లింలది). మసీదులు తవ్వేందుకు సిద్ధమేనా’’ అంటూ మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. హనుమాన్ జయంతి సందర్భంగా బుధవారం కరీంనగర్లో నిర్వహించిన హిందూ ఏక్తా యాత్రలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘తెలంగాణకు పట్టిన శనిని కాషాయంతో కడిగేసి రామరాజ్యం స్థాపించి తీరుతాం. లవ్ జిహాదీ అంటే లాఠీ రుచి చూపిస్తాం. మత మార్పిడిలు చేస్తే మక్కెలిరగదీస్తాం. రాష్ట్రంలోని మదర్సాలు ఉగ్రవాద శిక్షణ కేంద్రాలుగా మారాయి. వాటికి కంప్యూటర్లు అందజేసి ఆర్థిక సహాయం చేయడం సిగ్గుచేటు.
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక మదర్సాలను రద్దు చేస్తాం. ఉర్దూ భాషను శాశ్వతంగా తొలగిస్తాం. మైనారిటీ రిజర్వేషన్లను కూడా రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీలకు వాటిని వర్తింపజేస్తాం. అతి త్వరలో రజాకార్ల ఫైల్స్ సినిమా రాబోతోందది. రజాకారుల అకృత్యాలను తెలంగాణ ప్రజలకు చూపిస్తాం. కరీంనగర్ నడిబొడ్డున ఉన్న ఈద్గా పోవాలన్నా.. వేములవాడ రాజన్న గుడిలోని దర్గా తొలగించబడాలన్నా రామరాజ్యం రావల్సిందే’’ అని ఆయన అన్నారు. కరీంనగర్ బస్టాండ్లో, కోరుట్లలో, జగిత్యాలలో, లుంబినీ పార్కు, గోకుల్ చాట్లలో, సాయిబాబా గుడిలో బాంబులు పెట్టి అమయాకుల ప్రాణాలు తీసింది మీరు కాదా? వరంగల్లో పూజారిని, నాగరాజును హత్యచేసింది మీరు కాదా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో రామరాజ్యం స్థాపన కోసం తన చివరి రక్తంబొట్టు వరకు పోరాడుతానని, ఏ హిందువుకు కష్టం వచ్చినా హనుమంతుడి భక్తుడిగా, ఛత్రపతి శివాజీ వారసుడిగా, పెద్దన్నగా వారికి అండగా ఉంటానని అన్నారు. తనతో కలిసి పోరాడేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నిజాయితీగా, నిబద్ధతతో పనిచేస్తున్న తనపై కొందరు అవాకులు, చవాకులు పేలుతున్నారని, తనను ఎంపీగా గెలిపించినందున హిందువుల కోసం యుద్ధం చేసే అవకాశమొచ్చిందని, తనను విమర్శించవద్దని ఆయన కోరారు. భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ సమయంలో పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసినవారిని, మతమార్పిడిలు చేసినవారినీ తరిమికొట్టానన్నారు. కరీంనగర్ నడి చౌరస్తాలోని ఈద్గాను తొలగించేందుకు పోరాడి జైలుకెళ్లానని చెప్పారు. మూడుసార్లు తనను చంపాలని ప్రయత్నించారని, అయినా కాషాయం జెండా వీడలేదని, కరీంనగర్ గడ్డను విడిచిపోలేదని ఆయన తెలిపారు.
సంజయ్ని సీఎం చేస్తే ‘బంగారు తెలంగాణ’
బండి సంజయ్ని ముఖ్యమంత్రిని చేస్తే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని శ్రీనివాసానంద సరస్వతీ స్వామీజీ అన్నారు. హిందూ ఏక్తాయాత్రకు ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రజలకు ఎంత వరకు న్యాయం చేశారని ప్రశ్నించారు. భాగ్యనగరం పేరు రావాలన్నా.. భద్రాద్రి అభివృద్ధి చెందాలన్నా సంజయ్ సీఎం కావాలని, అందుకు సాధు, సత్పురుషులు, పీఠాధిపతులు, ఆయన వైపే చూస్తూ తమ శక్తిని ధారపోసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 27 సంవత్సరాలుగా హిందువుల కోసం కృషి చేస్తున్న ఓ సింహం బండి సంజయ్ అని అభినందించారు.