- ఫోర్బ్స్ టాప్-100 రిచ్ లిస్ట్లో వరుసగా 14వ ఏడాదీ అగ్రస్థానం
- ద్వితీయ స్థానంలో గౌతమ్ అదానీ
- సంపన్న మహిళ సావిత్రి జిందాల్
- ఐదుగురు తెలుగు వారికీ చోటు
- కుబేరుల మొత్తం సంపదలో 50 శాతం వృద్ధి నమోదు
- రూ.57.35 లక్షల కోట్లకు చేరిక
న్యూఢిల్లీ: ఈ ఏడాదికి గాను ఫోర్బ్స్ విడుదల చేసిన వంద మంది భారత కుబేరుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీకి మరోసారి అగ్రస్థానం దక్కింది. 9,270 కోట్ల డాలర్ల (సుమారు రూ.6.86 లక్షల కోట్లు) సంపదతో వరుసగా 14వ ఏడాదీ ఆయనే నం.1గా కొనసాగారు. గత ఏడాదితో పోల్చితే, ఆయన ఆస్తి 400 కోట్ల డాలర్ల మేర పెరిగిందని ఫోర్బ్స్ వెల్లడించింది. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ 7,480 కోట్ల డాలర్ల (రూ.5.53 లక్షల కోట్లు) నెట్వర్త్తో రెండో స్థానంలో నిలిచారు.
గత ఏడాదితో పోల్చితే, ఆయన సంపద మూడింతలైంది. హెచ్సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్, డీ-మార్ట్ స్టోర్ల అధిపతి రాధాకిషన్ దమానీ, సీరమ్ ఇన్స్టిట్యూట్కు చెందిన సైరస్ పూనావాలా వరుసగా 3,4,5 స్థానాల్లో ఉన్నారు. ఈసారి పూనావాలా హిందూజాల స్థానాన్ని భర్తీ చేశారు. హిందూజా సోదరుల సంపద 1,400 కోట్ల డాలర్లకు తగ్గడంతో ఈ ఏడాది వారు 15వ స్థానానికి పరిమితం అయ్యారు. మరిన్ని విషయాలు..
ఓపీ జిందాల్ గ్రూప్ గౌరవ చైర్పర్సన్ సావిత్రి జిందాల్ దేశంలో అత్యంత సంపన్న మహిళగా నిలిచారు. 1,800 కోట్ల డాలర్ల ఆస్తితో ఈసారి ఆమె టాప్ టెన్ జాబితాలోకి పునఃప్రవేశించారు.
కరోనా కష్టకాలంలోనూ జాబితాలోని 80 శాతానికి పైగా కుబేరుల సంపద పెరిగింది. 61 మంది ఆస్తి కనీసం 100 కోట్ల డాలర్ల మేర వృద్ధి చెందింది. నలుగురు ఫార్మా బిలియనీర్ల సంపద మాత్రం క్షీణించింది.
ఈ ఏడాది జాబితాలో కొత్తగా ఆరుగురికి స్థానం లభించింది. గత ఏడాది జాబితా లోని 11 మంది ఈసారి స్థానం కోల్పోయారు.
గడిచిన ఏడాది కాలంలో ఫోర్బ్స్ కుబేరుల మొత్తం సంపద 50 శాతం (25,700 కోట్ల డాలర్లు) వృద్ధి చెంది 77,500 కోట్ల డాలర్లకు (రూ.57.35 లక్షల కోట్లు) పెరిగింది.
కుబేరులకు వారి కంపెనీల్లో ఉన్న వాటాలు, గతనెల 17న స్టాక్ మార్కెట్లో షేర్ల ధరల ఆధారంగా ఈ జాబితాను రూపొందించినట్లు ఫోర్బ్స్ స్పష్టం చేసింది.
Courtesy Andhrajyothi