కేసు ఉపసంహరించుకోకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులు
హైదరాబాద్: అతడు న్యాయశాస్త్ర పుస్తకాల రచయిత. దశాబ్దాలుగా సుజాత పబ్లిషింగ్ హౌస్ ద్వారా విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు రూపొందిస్తుంటాడు. అతడు బాలికపై లైంగిక దాడి కేసులో మంగళవారం అరెస్టయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలివి. గాదె వీరారెడ్డి(72) బర్కత్పుర గోకుల్ధామ్ అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. 2010 నుంచి గాదె ఇంట్లో ఒక మహిళ పనిచేసేది. 2017 నుంచి ఆమె బడంగ్పేట్ వద్ద బంధువులు కొనుగోలు చేసిన ఇంట్లో ఉంటోంది. కుట్టు పని కూడా చేస్తోంది. న్యాయశాస్త్ర పుస్తకాలు ఉంచేందుకు అవసరమైన సంచులు కుట్టించేందుకు తరచూ వీరారెడ్డి ఆమె ఇంటికి వెళ్తుండేవాడు. అలా సెప్టెంబరులో వెళ్లినపుడు ఆమె కుమార్తె(13)తో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ మహిళ ఊళ్లో తండ్రి సంవత్సరీకంలో పాల్గొనేందుకు వెళుతూ డిసెంబరులో కూతుర్ని తన సోదరుడి ఇంట్లో ఉంచగా.. అదే రోజు వీరారెడ్డి బాలికపై మరోసారి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక.. తల్లికి చెప్పింది. మీర్పేట్ ఠాణాలో ఫిర్యాదు చేయటంతో మంగళవారం నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడి ద్విచక్ర వాహనం, మొబైల్ ఫోన్ సీజ్ చేశారు. కేసు వెనక్కి తీసుకోకుంటే ఆత్మహత్య చేసుకుంటానని, దీనికి బాలిక తల్లి, ఆమె బంధువు వేధింపులే కారణమంటూ పేర్లు రాస్తానని వాట్సప్లో మెసేజ్లు పంపి బెదిరించినట్టు పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించిన రెండు నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్లు కూడా స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. నిందితుడిని పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు.
Courtesy Eenadu