-
బలపరీక్ష 26కు వాయిదా
- కరోనాయే కారణం.. బీజేపీ ఆగ్రహం..
- సుప్రీంలో కేసు.. నేడు సుప్రీం విచారణ
- నేడు నిరూపించుకోవాలని గవర్నర్ మళ్లీ ఆదేశం
భోపాల్ : మధ్యప్రదేశ్లో రాజకీయం నాటకీయ మలుపు తిరిగింది. రాష్ట్ర గవర్నర్ లాల్జీ టాండన్ ఆదేశాల మేరకు సోమవారం బలపరీక్ష జరగాల్సి ఉన్నప్పటికీ కరోనా కారణం చెప్పి స్పీకర్ ఎన్పీ ప్రజాపతి దాన్ని వాయిదా వేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం పూర్తి కాగానే కరోనా వల్ల సభను ఈనెల 26వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. తక్షణం బలపరీక్ష నిర్వహించేట్లు స్పీకర్ను ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో అత్యవసరంగా ఓ పిటిషన్ వేసింది. దీనిపై కోర్టు మంగళవారం విచారణ జరపనుంది. గవర్నర్ కూడా మంగళవారం బలపరీక్ష ఎదుర్కోవాలని సీఎంని రెండోసారి ఆదేశించారు. సోమవారం గవర్నర్ ప్రసంగం ముగియగానే మంత్రి గోవింద్సింగ్ కరోనా విషయాన్ని లేవనెత్తి సామూహిక సమావేశాలు వద్దని కేంద్రం ఆదేశాలిచ్చిందన్నారు.
వెంటనే స్పీకర్ ‘ఎమ్మెల్యేల ఆరోగ్యం దృష్ట్యా సభను పదిరోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు, పరిస్థితిని బట్టి ఆ తర్వాత నిర్ణయం తీసుకోనున్నట్లు’ చెప్పారు. సభలో గందరగోళం చెలరేగింది. స్పీకర్ వెంటనే సభను వాయిదావేశారు. మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్- సుప్రీంకెక్కుతున్నట్లు ప్రకటించారు. ‘ప్రభుత్వం మైనారిటీలో పడింది. ఆరుగురు మంత్రులు, 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వెంటనే విచారణ జరపాలి. సుప్రీంకోర్టు ఆదేశించిన 12 గంటల లోపు పరీక్ష జరిగేలా చూడండి’ అని తన పిటిషన్లో కోరారు. కాగా, 106 మంది ఎమ్మెల్యేలను గవర్నర్ ఎదుట పరేడ్ చేయించింది బీజేపీ! 22 మంది ఎమ్మెల్యేలు బీజేపీ చెరలో బెంగళూరులో ఉన్నట్లు తెలిసినా బలపరీక్షను కోరాలని చెప్పడమేంటని గవర్నర్ను ప్రశ్నిస్తూ కమల్నాథ్ ఆయనకో లేఖరాశారు. ఎమ్మెల్యేలు విడుదల కానంతవరకూ పరీక్ష సాధ్యం కాదన్నారు.
Courtesy Andhrajyothi