- బాలికలతో వెకిలి చేష్టలు
- దేహశుద్ధి చేసిన తల్లిదండ్రులు
వైరా : ఆయనో ప్రధానోపాధ్యాయుడు.. నలుగురికి నడవడిక నేర్పాల్సినవాడు.. అలాంటివాడే నడత తప్పాడు.. విద్యార్థినులతో వెకిలిగా ప్రవర్తించసాగాడు. దీనికి పరాకాష్ట అన్నట్లు.. ‘గాంధీ’ సినిమా ప్రదర్శన సందర్భంగా బాలికల మధ్యన కూర్చుని అసభ్యంగా వ్యవహరించాడు. దీంతో విద్యార్థినులు తల్లిదండ్రుల వద్ద వాపోయారు. తీవ్ర ఆగ్రహంతో వారు సోమవారం ప్రధానోపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. ఈ ఘటన వెనకున్న వివరాలు తల్లిదండ్రులు తెలిపిన ప్రకారం.. ఖమ్మం జిల్లా వైరా మండలం కనకగిరి సిరిపురంలోని జడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం ఎస్.రామారావు 17న ‘గాంధీ’ సినిమా చూపించేందుకు విద్యార్థులను వైరా తీసుకెళ్లాడు. విద్యార్థినుల మధ్యలో కూర్చుని వెకిలిగా ప్రవర్తించటంతో తల్లిదండ్రులు హెచ్ఎంను కలిసి మాట్లాడేందుకు నాలుగైదు రోజులుగా ప్రయత్నిస్తున్నా సుముఖత చూపడం లేదు.
సోమవారం పాఠశాలకు వెళుతున్న హెచ్ఎంను గ్రామ నడిబొడ్డున అడ్డుకున్న తల్లిదండ్రులు కారులోంచి బయటకు లాగి కొట్టారు. సర్పంచ్ ఇంటి వద్ద నిర్బంధించారు. హెచ్ఎంను అతికష్టమ్మీద పోలీసులు వైరా తరలించారు.తల్లిదండ్రులు, గ్రామస్థులు పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు. సిరిపురంలో పనిచేయనని రామారావు లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో శాంతించారు.