మానవ హక్కులు మాయం

0
126

– భారత్‌లో పేరుకే.. ఆర్థిక, సామాజిక, రాజకీయ హక్కులు
పాలకుల్ని ఎవరైనా ప్రశ్నిస్తే.. అరెస్టులు, కేసులు
నాణ్యమైన జీవితాన్ని పొందే హక్కులో భారత్‌ స్కోర్‌ 61.6శాతం
మనదేశం కన్నా మెరుగైన స్థితిలో బంగ్లాదేశ్‌, శ్రీలంక, నేపాల్‌, భూటాన్‌, పాకిస్థాన్‌
– 13 రకాల మానవ హక్కుల అమలుపై హెచ్‌ఆర్‌ఎంఐ నివేదిక

అత్యవసరమైన సామాజిక, ఆర్థిక హక్కులను సైతం భారతదేశ పౌరులు పొందలేకపోతున్నారని హ్యూమన్‌ రైట్స్‌ మేజర్‌మెంట్స్‌ ఇన్షియేటివ్‌‘ (హెచ్‌ఆర్‌ఎంఐ) నివేదిక తెలిపింది. విద్యా హక్కు, పనిని పొందే హక్కు, అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు…మొదలైన 13రకాల హక్కుల అమలు భారత్‌లో అత్యంత దయనీయంగా ఉందని వెల్లడించింది. దక్షిణాసియా దేశాలతో పోల్చితే భారత్‌ చాలా వెనుకబడి ఉందని నివేదిక పేర్కొన్నది. మొత్తం 13రకాల హక్కుల్లో సగమైనా కనీసస్థాయిలో అమలు కావటం లేదని హెచ్‌ఆర్‌ఎంఐ-2022 ప్రాజెక్ట్‌ వెల్లడించింది.

వెల్లింగ్టన్‌ : మానవ హక్కులపై న్యూజిలాండ్‌కు చెందిన ‘మోటు ఎకనామిక్‌, పబ్లిక్‌ పాలసీ రీసెర్చ్‌’ ఇన్సిటిట్యూట్‌ ప్రతిఏటా గణాంకాల్ని విడుదల చేస్తోంది. ఆయా దేశాల్లో పౌరులు 13 రకాల హక్కుల్ని ఏ స్థాయిలో పొందుతున్నారనే సమాచారాన్ని ‘హెచ్‌ఆర్‌ఎంఐ’ రూపొందిస్తోంది. తాజాగా 2022 ఏడాదికి సంబంధించి 37 దేశాల్లో హక్కుల అమలు ఏవిధంగా ఉందన్నది తెలియజేస్తూ గణాంకాల్ని విడుదల చేసింది. ఇందులో పేర్కొన్న విషయాలు ఈ విధంగా ఉన్నాయి. నాణ్యమైన జీవనం పొందే హక్కు (విద్య, ఆహారం, గృహం, పని) విషయంలో భారత్‌ తీరు అత్యంత దయనీయంగా ఉంది. బంగ్లాదేశ్‌, నేపాల్‌, భూటాన్‌, శ్రీలంక, పాకిస్థాన్‌ మనకన్నా మెరుగైన స్థితిలో ఉన్నాయి. మరణశిక్షను అత్యంత తక్కువగా అమలుజేసిన దేశంగా..ఈ ఒక్క విషయంలో మాత్రమే భారత్‌ మెరుగైన స్కోర్‌ సాధించింది. మిగతా 12 రకాల హక్కుల విషయంలో భారత్‌ చాలా వెనుకబడి ఉందని ‘హెచ్‌ఆర్‌ఎంఐ’ వెల్లడించింది.

రక్షణ ఏది?
పౌరులకు ఆర్థిక, సామాజిక హక్కులు అందించటంలో భారత్‌ ఇంకా ఎంతో సాధించాల్సి వుంది. పోలీసు అరెస్టులు, నిర్బంధం విచ్చలవిడిగా సాగుతున్నాయి. రాజ్యవ్యవస్థ నుంచి రక్షణ అన్నదాంట్లో భారత్‌ స్కోర్‌ 4.6గా ఉంది. క్రితం ఏడాదితో (2021) పోల్చితే ప్రస్తుతం, మనదేశంలో అక్రమ అరెస్టులు, పోలీసు వేధింపులు, వివక్ష తీవ్రస్థాయిలో ఉన్నాయి. కిడ్నాప్‌లు, హత్యలకు అడ్డుకట్ట పడటం లేదు. ప్రజాస్వామ్య హక్కుల్లో భారత్‌కు 4.5స్కోర్‌ దక్కింది. ప్రజాస్వామ్యవా దులు, సంస్థలు పాలకులకు వ్యతిరేకంగా మాట్లాడితే, వారి జీవితాలు ప్రమాదంలో పడుతున్నాయి. ఏకపక్షంగా కేసుల నమోదుచేస్తూ వారిని జైల్లో నిర్బంధిస్తున్నారు. దళిత, గిరిజన హక్కులపై పోరాడేవారిని, మైనార్టీ హక్కులపై పోరాడేవారిని పాలకులు నిర్బంధిస్తున్నారు. జర్నలిస్టులు, విద్యార్థి సంఘం నాయకుల్ని పోలీసులు టార్గెట్‌ చేస్తున్నారు.

13 హక్కులు ఏంటి?
విద్యా హక్కు, ఆహారం, ఆరోగ్యం, గృహం, పనిని పొందే హక్కులు. ఏకపక్షంగా పోలీసు అరెస్టులు, బలవంతంగా నిర్బంధించటం, మరణ శిక్ష, హత్యలు..లేకపోవటం, వేధింపులు, వివక్ష లేకపోవటం, గుమికూడే, సంఘాన్ని ఏర్పాటు చేసుకునే హక్కు, అభిప్రాయాన్ని, ఆందోళనను తెలిపే హక్కు, పాలనలో భాగస్వామ్యం పొందే హక్కు. ఇవన్నీ మానవ హక్కుల కిందకే వస్తాయి. అంతర్జాతీయ చట్టాలననుసరించి పౌరులు ఏమేరకు హక్కులను కలిగివున్నారన్నది ‘హెచ్‌ఆర్‌ఎంఐ’ అధ్యయనం చేసింది. సమావేశం, సంఘాన్ని ఏర్పాటుచేసే హక్కులో…10 మార్కులకు భారత్‌ 3.6 స్కోర్‌ సాధించింది. అభిప్రాయాన్ని, ఆందోళనను తెలిపే హక్కులో 3.5, ప్రభుత్వపాలనలో భాగస్వామ్యం పొందటంలో 6.8 స్కోర్‌ సాధించింది.

Leave a Reply