వైద్యుడి సూచనతోనే చేయాలి: కేంద్రం
న్యూఢిల్లీ : తేలికపాటి కరోనా లక్షణాలు ఉంటే ఇకపై గాబరాగా ఆస్పత్రులకు పరుగులు తీయాల్సిన పనిలేదు. స్థానిక సర్వైలెన్స్ మెడికల్ ఆఫీసర్ను సంప్రదించి, అంతగా భయపడాల్సిన పనిలేదని ఆయన సిఫారసు చేస్తే ఇళ్లలోనే ఐసొలేట్ అయిపోవచ్చు. ఈమేరకు హోం ఐసొలేషన్ నిబంధనలతో కేంద్ర ఆరోగ్యశాఖ కొత్త మార్గదర్శకాలను జారీచేసింది. వాటి ప్రకారం.. తేలికపాటి కొవిడ్ లక్షణాలు ఉన్నవారు తమతమ ఇళ్లలోనే ఇతర కుటుంబ సభ్యులకు దూరంగా మెలుగుతూ ఐసొలేషన్లో ఉండొచ్చు. అయితే ఐసొలేషన్కు తగిన వసతులు ఉన్నాయా అనేది ప్రాతిపదికగా తీసుకుంటారు. ఈ సమయంలో కరోనా అనుమానితుడి కుటుంబ సభ్యులు, సన్నిహితంగా మెలిగేవారు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఔషధంతో పాటు వైద్యులు సూచించిన ఇతర మందులు వాడాల్సి ఉంటుంది. ఫోన్లో తప్పకుండా ఆరోగ్యసేతు యాప్ను డౌన్లోడ్ చేసుకొని, బ్లూటూత్, వైఫై ఆన్లో ఉంచుకోవాలి.
ఆరోగ్య స్థితిగతుల వివరాలను స్వయంగా రోగి లేదా అతడి కుటుంబీకుల్లో ఒకరు సమీపంలోని కొవిడ్ హెల్త్కేర్ సెంటర్ వైద్యులకు తెలియజేస్తూ ఉండాలి. ఒకవేళ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీనొప్పి, మానసిక సమస్యలు, పెదవులు/ముఖం నీలిరంగులోకి మారి పాలిపోవడం వంటివి జరిగితే వెంటనే వైద్యసహాయం పొందాలి. తేలికపాటి కరోనా లక్షణాలు పూర్తిగా దూరమయ్యాయని భావిస్తే స్థానిక సర్వైలెన్స్ మెడికల్ ఆఫీసర్ పర్యవేక్షణలో కొవిడ్ పరీక్ష చేయించుకొని, ఇన్ఫెక్షన్ లేదని ధ్రువీకరణ పొందిన తర్వాతే హోం ఐసొలేషన్ను విరమించాలి. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కొవిడ్-19 కేసుల్లో 80 శాతం తేలికపాటి లక్షణాలు కలిగినవారివేనని, 20 శాతం కేసులే ఆస్పత్రుల్లో చికిత్స అందించేంత తీవ్రమైనవని తాజా గణాంకాలను బట్టి తెలుస్తోంది.
Courtesy Andhrajyothi