- నాలుగో వంతు తగ్గిన రాష్ట్ర కేటాయింపులు
- రూ.7-9 వేల కోట్ల కేంద్ర నిధులకు గండి
- కేంద్ర పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్లు లేవు!
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాల డబ్బులను వినియోగించుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ల కింద నిర్ణీత శాతం మొత్తాన్ని కేటాయించాలి. ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్లో అలాంటి పథకాలకు కేటాయింపులు భారీగా తగ్గిపోయాయి. దాంతో కేంద్రం నుంచి వచ్చే నిధులపై ఆశలు సన్నగిల్లే పరిస్థితి ఏర్పడింది. ఉదాహరణకు గ్రామీణ ఉపాధి హామీ పథకానికి వేతనాల్లో 90 శాతం, మెటీరియల్ కాంపొనెంట్ 75 శాతం కేంద్రం భరిస్తుంది. మిగతాది రాష్ట్రం ఇవ్వాలి. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం భరించాలి. బడ్జెట్లో కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్రం తన వాటాను భారీగా తగ్గించింది. ఉపాధి హామీ పథకం కేటాయింపులు నాలుగో వంతుకు పడిపోయాయి. కోతల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి కోట్లు మిగిలించుకుంటే కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో ఏడు నుంచి తొమ్మిది వేల కోట్లకు గండి పడనుంది. హరితహారంతో పాటు పంచాయతీల్లో ప్రారంభించిన 30 రోజుల కార్యాచరణలో శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు, పంచాయతీ, అంగన్వాడీ భవనాల నిర్మాణానికి ఉపాధి హామీ నిధులే వాడాలని చెప్పారు. కేటాయింపులు మాత్రం భారీగా తగ్గించారు.
(Courtacy Andhrajyothi)