ఒలింపిక్స్ జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రాకు స్వర్ణం
ఒలింపిక్ అథ్లెటిక్ స్టేడియంలో బహుమతి ప్రదానోత్సవం!
పతకం నెగ్గిన ముగ్గురు అథ్లెట్ల జాతీయ జెండాలు పైకెగురుతున్నాయ్!
అందులో మన మువ్వన్నెల జెండా కూడా ఉంది! భారత జాతీయ గీతం వినిపిస్తోంది!
పోడియంపై భారత క్రీడాకారుడూ ఉన్నాడు. అతడి మెడలో పతకం పడుతోంది!
… ఇది 1900లో భారత తొలి ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ విశ్వ క్రీడల్లో అడుగు పెట్టినప్పట్నుంచి కంటున్న కల!
అప్పటి భారత జనాభా 24 కోట్లు. ఇప్పుడది 130 కోట్లను దాటిపోయింది. ఈ 121 ఏళ్లలో ఇన్ని కోట్ల మందిలో లక్షల మంది అథ్లెటిక్స్ ఆడారు. వందల మంది ఒలింపిక్స్లో పోటీపడ్డారు. అందులో మిల్కా సింగ్, పీటీ ఉష.. లాంటి ఆశలు రేపిన దిగ్గజాలూ ఉన్నారు. కానీ అందరికీ పతకం ఓ సుదూర స్వప్నమే!
ఇన్నేళ్లకు ఒకడొచ్చాడు. ఒలింపిక్స్ అథ్లెటిక్స్లో ఓ భారతీయుడు పతకం సాధిస్తేనే దాన్నొక అద్భుతంలా చూసే స్థితిలో.. నీరజ్ చోప్రా ఏకంగా స్వర్ణానికే గురి పెట్టేశాడు..! తొలి ప్రయత్నంలోనే శక్తినంతా కూడదీసుకుని ‘టాప్’ లేచిపోయేలా విసిరాడు బల్లెం. పట్టికలో మనోడిదే అగ్రస్థానం! కాసేపటికి మళ్లీ వచ్చాడు. ఈసారి ఇంకా దూకుడుగా విసిరాడు. బల్లెం ఎక్కడ పడిందో కూడా చూడలేదు. తన ప్రదర్శన ఎంతో కూడా తెలుసుకోలేదు. విసురుతున్నపుడే అతడికర్థమైపోయింది.. తాను చరిత్ర సృష్టించేశానని! అంతే.. వెనక్కి తిరిగి.. ‘‘నేను సాధించేశా’’ అన్నట్లు చేశాడు ఒక సింహనాదం! ఆ క్షణం.. భారత క్రీడా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఒక మహాద్భుతం!
2021 ఆగస్టు 7.. శనివారం సాయంత్రం.. సమయం 5.30 గంటలు.. టోక్యో ఒలింపిక్ అథ్లెటిక్ స్టేడియంలో జావెలిన్ త్రో పతక ప్రదానోత్సవం జరుగుతోంది. జెండాలు పైకెగురుతున్నాయ్. మన త్రివర్ణ పతాకం అటో ఇటో కాదు.. మధ్యలో ఉంది. పోడియంపై మన నీరజ్ చోప్రా ఉన్నాడు.. అది కూడా అందరికంటే ఎత్తులో! కాంస్యమో, రజతమో కాదు.. అతణ్ని వరించింది ఏకంగా స్వర్ణమే!
వందేళ్లకు పైగా నిరీక్షించిన విజయమిది.
87.58 మీటర్లు
జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ చోప్రా అత్యుత్తమ ప్రదర్శన ఇది. తన రెండో ప్రయత్నంలో విసిరిన ఈ త్రోతో అతడు స్వర్ణం చేజిక్కించుకున్నాడు.
1
ఒలింపిక్ అథ్లెటిక్స్లో భారత్కు వచ్చిన తొలి స్వర్ణమిదే. 121 ఏళ్ల భారత ఒలింపిక్ చరిత్రలో అథ్లెటిక్స్లో దక్కిన మొదటి పతకమిది.
7
టోక్యోలో భారత అథ్లెట్లు గెలిచిన పతకాలు. లండన్ ఒలింపిక్స్లో సాధించిన ఆరు పతకాల రికార్డును అధిగమించింది.
10
ఒలింపిక్స్ చరిత్రలో భారత్ ఇప్పటివరకూ పది స్వర్ణాలు గెలిచింది. హాకీలో అత్యధికంగా 8 బంగారు పతకాలు వచ్చాయి. 2008లో షూటింగ్లో అభినవ్ బింద్రా పసిడి గెలిచాడు. ఆ తర్వాత వ్యక్తిగత విభాగంలో మరో స్వర్ణం రావడం ఇదే తొలిసారి.
నీరజ్ చోప్రాకు అభినందనల వెల్లువ
నీరజ్ నీది అద్వితీయ విజయం. ఎన్నో అడ్డంకుల్ని అధిగమించి బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించావు. తొలిసారి ఒలింపిక్స్లో పాల్గొని స్వర్ణం అందించిన నీ ప్రతిభ దేశ యువతకు స్ఫూర్తిగా నిలుస్తుంది. ఈ విజయం చూసి దేశం ఉప్పొంగింది. హృదయపూర్వక అభినందనలు.
– రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్.
అద్వితీయమైన విజయం. ఈ విజయం భారతీయులందరిలోనూ ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని నింపింది.
– ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
టోక్యోలో చరిత్ర లిఖించావు. దృఢ సంకల్పంతో, పట్టుదలతో నువ్వు ఈరోజు సాధించిన విజయం కొన్ని తరాల వరకూ గుర్తుండిపోతుంది. శుభాభినందనలు.
– ప్రధాని నరేంద్ర మోదీ
నీవల్ల ఈ రోజు భారత్ వెలిగిపోతోంది. నువ్వు విసిరిన జావెలిన్ మువ్వెన్నల జెండాను తీసుకెళ్తూ రెపరెపలాడేలా చేసింది.
– సచిన్ తెందుల్కర్
ఒక జాతి కలను నిజం చేశావ్. వందనాలు అందుకో. ఈ విజయం గర్వంగా ఉంది. బంగారు క్లబ్లోకి స్వాగతం.
– అభినవ్ బింద్రా, షూటర్, 2008 ఒలింపిక్స్ స్వర్ణ విజేత
నా 37 ఏళ్ల కల నిజం చేశావు. హృదయపూర్వక ధన్యవాదాలు.
– పీటీ ఉష, ఒలింపియన్
నీరజ్ చోప్రాకు ఫోన్ చేసిన దత్తాత్రేయ
టోక్యో ఒలింపిక్స్లో జావెలిన్ త్రో విభాగంలో భారత్కు పసిడి పతకాన్ని తెచ్చిపెట్టిన నీరజ్ చోప్రాకు అభినందనలు వెల్లువెత్తాయి. హరియాణా గవర్నర్ దత్తాత్రేయ నీరజ్ చోప్రాకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. దేశానికి స్వర్ణ పతకం రావడం పట్ల పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్రెడ్డి హర్షం ప్రకటించారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నీరజ్ చోప్రాకు అభినందనలు తెలిపారు.
కంచు మోగించిన బజ్రంగ్
పసిడి వేటకు దూరమైన భారత స్టార్ రెజ్లర్ బజ్రంగ్ కంచు మోగించాడు. శనివారం కాంస్యం కోసం జరిగిన 65 కిలోల ప్లేఆఫ్ మ్యాచ్లో అతడు 8-0తో నియజ్బెకోవ్ (కజకిస్థాన్)పై విజయం సాధించాడు.
Courtesy Eenadu