న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి భారత దేశంలో క్రమంగా వ్యాపిస్తోంది. దేశంలో 396 మంది కోవిడ్-19 బారిన పడినట్టు తాజా సమాచారం. ఆదివారం ఒక్కరోజే దేశంలో 81 కరోనా పాజిటవ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యథికంగా 70 మంది, కేరళలో 52 మంది, ఉత్తరప్రదేశ్ లో 25 మంది, రాజస్థాన్ లో 24 మంది, కర్ణాటకలో 20 మంది, హర్యానాలో 17 మంది, గుజరాత్ లో 14 మంది, పంజాబ్, లదాఖ్ లో 13 మంది చొప్పున, తమిళనాడులో ఆరుగురు కోవిడ్ బారిన పడినట్టు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కోవిడ్-19 బారిన పడి ఇప్పటివరకు మన దేశంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా 3.32 లక్షల మంది కరోనా కాటుకు గురికాగా, 14,436 మంది మృత్యువాత పడ్డారు.
తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా విజృంభణ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. తెలంగాణ ఇప్పటివరకు 27 మంది కోవిడ్ బారిన పడ్డారు. ఆదివారం ఒక్క రోజే ఆరు కేసులు వెలుగు చూశాయి. మొత్తం కేసుల్లో 26 కేసులు 9 రోజుల వ్యవధిలో నమోదు కావడం గమనార్హం. తెలంగాణలో నమోదైన 27 కోవిడ్ కేసుల్లో 12 యూరప్ నుంచి వచ్చిన వారిలోనే నిర్ధారణ అయ్యాయి. ఇండోనేసియా నుంచి వచ్చిన ఆ దేశస్తులు 10 మంది, లండన్ నుంచి వచ్చిన ఆరుగురు, దుబాయ్ నుంచి వచ్చిన నలుగురు కరోనా పాజిటివ్ గా తేలారు. ఆంధ్రప్రదేశ్ లో ఆరుగురికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.