- వ్యవసాయ విశ్వవిద్యాలయం హాస్టల్లో ర్యాగింగ్
- ఢిల్లీలోని యాంటీ ర్యాగింగ్ హెల్ప్లైన్కు ఫిర్యాదు
- వేధించినందుకు 20 మంది విద్యార్థులపై చర్యలు
- సెమిస్టర్, హాస్టల్ నుంచి ఏడుగురి బహిష్కరణ
- వసతి గృహం నుంచి మరో 13 మంది సస్పెన్షన్
రాజేంద్రనగర్ : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం క్యాంప్సలోని రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల వసతి గృహంలో ర్యాగింగ్ చోటుచేసుకుంది. రికార్డులు రాసి పెట్టాలని, రోజూ టక్ చేసుకోవాలని, షూ దరించాలంటూ బీఎస్సీ (ఆనర్స్) మొదటి సంవత్సరం విద్యార్థులను ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు వేధించారు. దుస్తులు విప్పాలని కూడా కోరినట్లు తెలిసింది. విచారణలో ఇదంతా నిర్ధారణ కావడంతో ఏడుగురు విద్యార్థులను ఒక సెమిస్టర్ పాటు కళాశాల నుంచి, హాస్టల్ నుంచి పూర్తిగా బహిష్కరించారు. జూనియర్లను కొంత తక్కువగా వేధించిన 13 మంది విద్యార్థులను వసతి గృహం నుంచి బహిష్కరించారు.
ఈ వివరాలను వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.సుధీర్కుమార్ శుక్రవారం వెల్లడించారు. సీనియర్లు వేధిస్తున్నారంటూ కొందరు విద్యార్థులు ఢిల్లీలోని యాంటీ ర్యాంగింగ్ హెల్ప్ లైన్కు ఫిర్యాదు చేశారు. దీంతో వివరణ కోరుతూ.. ఈ నెల 25న వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్, యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ చైర్మన్ డాక్టర్ సి.నరేందర్రెడ్డికి లేఖ రాశారు. ఈ విషయాన్ని డాక్టర్ నరేందర్రెడ్డి వర్సిటీ ఉన్నతాధికారులకు తెలియజేశారు. మంగళవారం ఆయనతో పాటు విద్యార్థి వ్యవహారాల డీన్, యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ బృందాలు మొదటి సంవత్సరం విద్యార్థుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఉన్నతాధికారులకు సమాచారం తెలియజేశారు. మొత్తం 20 మంది సీనియర్లు ర్యాగింగ్కు పాల్పడినట్లు అధికారుల విచారణలో తేలింది.