- ఓయూలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది
- యువతిపై కత్తితో దాడి
- నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు
యువతుల రక్షణకై ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా.. వారిపై జరుగుతున్న దాడులు మాత్రం ఏమాత్రం ఆగడంలేదు. ప్రతిరోజూ దేశంలోని ఎదోమూల అత్యాచారాలు, దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా సికింద్రాబాద్ ఓయూలో జరిగిన మరొక ఘటన కలకలం రేపుతోంది. తన ప్రేమను అంగీకరించలేదని ఓ యవకుడు యువతిపై పదునైన ఆయుధంతో దాడి చేశాడు. ఈ ఘటనలో యువతి తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలైంది. ఈ ఘటన ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే జరగడం విశేషం.
వివరాల్లోకి వెళితే.. ముషీరాబాద్ భోలక్పూర్ బస్తీకి చెందిన యువతి (18) దగ్గరలోని ఓ ప్రైవేటు మెడికల్షాపులో పని చేస్తుంది. అదే బస్తీకి చెందిన రంజిత్ (18) అనే యువకుడు ప్రేమ పేరుతో నిత్యం ఆమె వెంటపడుతున్నాడు. నిత్యం ఆమెను కలవడానికి ప్రయత్నించేవాడు. తనకు ఇష్టం లేదని పలుమార్లు చెప్పినా యువకుడు వినలేదు. మాట్లాడుకుందామని చెప్పి ఓయూలోని మానేరు వసతిగృహం వద్దకు శనివారం రాత్రి ఏడుగంటల ప్రాంతంలో యువతిని యువకుడు తీసుకొచ్చాడు.
యువతి, యువకుడు మధ్య మాటామాట పెరిగి పెద్ద గొడవకు దారి తీసింది. దీంతో తన వెంట తెచ్చుకున్న పదునైన కత్తితో యువతిపై దాడి చేశాడు. దీంతో ఆమె చేయికి తీవ్ర గాయమైంది. యువతి గట్టిగా అరవడంతో.. యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు, పోలీసులు యువతిని కాచిగూడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. యువతి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఓయూ ఠాణాలో కేసు నమోదు అయింది. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.