- తలసరి ఆదాయం రూ. 2,78,833
- జీఎస్డీపీ రూ. 11,54,860 కోట్లు
- దేశంలోనే అత్యధిక వృద్ధిరేటు నమోదు
- 2021-22 గణాంకాలను విడుదల చేసిన కేంద్రం
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ), తలసరి ఆదాయంలో రికార్డు స్థాయి వృద్ధిరేటు నమోదు చేసింది. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం మొట్టమొదటిసారిగా జీఎస్డీపీ, తలసరి ఆదాయంలో భారీగా వృద్ధిరేటు నమోదు కావడం గమనార్హం. జీఎస్డీపీలో 19.46 శాతం నమోదు చేయగా తలసరి ఆదాయంలో దేశంలోనే అత్యధికంగా 19.10 శాతం వృద్ధిరేటును నమోదు చేయడం విశేషం. 2021-22 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ జీఎస్డీపీని ప్రస్తుత ధరల్లో రూ. 1,154,860 కోట్లుగా, తలసరి ఆదాయాన్ని రూ. 2,78,833గా కేంద్రం ధ్రువీకరించింది. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ (ఎంఓఎస్పీఐ) సోమవారం ఈ లెక్కలను అధికారికంగా విడుదల చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో కరోనా నేపథ్యంలో జీఎస్డీపీ వృద్ధిరేటు 2.25 శాతం మాత్రమే కాగా ఈసారి గణనీయంగా పెరిగింది. జీఎస్డీపీలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గత ఏడాది కంటే 16.85 శాతం అధిక వృద్ధిరేటును సాధించింది. తలసరి ఆదాయంలో వృద్ధిరేటు గత ఏడాది కంటే 17.14 శాతం ఎక్కువ సాధించింది.