తొమ్మిది నెలలు కడుపులో ప్రాణం పోసుకున్న బిడ్డ ఈ ప్రపంచంలోకి వచ్ఛి.. తన పేగు తెంచుకొంటున్న క్షణం… ఎంత అపురూపం?
ఐదారుగంటలు పురిటినొప్పులుభరించిన తల్లి బిడ్డను తొలిసారి తనివితీరా తడిమిన స్పర్శ… ఎంత మధురం?
కాన్పు గది బయట కాళ్లరిగేలా తిరుగుతున్న తండ్రికి బిడ్డను చేతిలో పెట్టగానే తొలిముద్దు పెట్టడం.. ఎంత తీపి జ్ఞాపకం?
ఈ అపురూప…మధుర… జ్ఞాపకాలు మనతో కలకాలం పదిలంగా ఉండాలంటే…! పదిమందితో వీటిని పంచుకోవాలంటే…!
‘మీ నాన్న పుట్టినప్పుడు ఎలా ఉన్నాడో చూడు’ అని… మనవళ్లకు చూపించి పొంగిపోవాలంటే! ఫొటో కావాలి… ఆ సందర్భాన్ని ఎంతో కళాత్మకంగా చిత్రీకరించే మనసున్న ఫొటోగ్రాఫర్ కావాలి.
… అలాంటి ఫొటోగ్రాఫరే… ఉర్షిత సెయిని. పుట్టుక చుట్టూ అల్లుకున్న సంప్రదాయాలను గౌరవిస్తూ… తల్లిదండ్రులనూ ఒప్పిస్తూ… దేశంలోనే తొలిసారి ఇలాంటి కెరీర్ను ఎంచుకొని రాణిస్తోంది ఈ బర్త్ ఫొటోగ్రాఫర్.
అసలు ఫొటో ఎందుకు: మధుర స్మృతులను నెమరువేసుకోవడానికే కదా! మరి ప్రసూతి వార్డులో కంటే తీయని జ్ఞాపకాలు ఎక్కడుంటాయి? వాటిని తన కెమెరాలో బంధించడమే వృత్తిగా మార్చుకొన్న ఉర్షితది దిల్లీ. డిగ్రీ పూర్తిచేసింది. ఓ ఫొటోగ్రఫీ మేగజైన్కు మెటర్నటీ సెక్షన్లో విధులు నిర్వర్తించే బాధ్యత ఒప్పుకొంది. ఈ నేపథ్యంలోనే బర్త్ ఫొటోగ్రఫీపై పరిశోధన చేసింది. అప్పటి వరకూ ప్రసూతిగదిలో ఫొటోలు తీసే విధానం మన దేశంలో లేదని గ్రహించింది. కానీ ఎంతో మంచి అనుభూతులను భద్రపరుచుకునే సంప్రదాయం ఇక్కడా రావాలని తలచింది. అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఉన్న ఈ ఫొటోగ్రఫీని ఇక్కడ వారికి పరిచయం చేయాలని సంకల్పించింది.
ఒప్పించడం ఎలా: తొలిపుట్టిన రోజుకు ఫొటోషూట్ అంటే ఒప్పుకొంటారు గానీ… పుట్టిన క్షణమే ఫొటోలు అంటే ఎవరు ఓకే అంటారు. అయినా తను ఒప్పించే ప్రయత్నం చేసింది. అన్నింటికన్నా ముందు వైద్యులను సంప్రదించింది. ప్రసూతిగదిలోని నిబంధనలు తెలుసుకుంది. ఫొటోగ్రాఫర్ పాటించాల్సిన నియమాలు, ఏ సందర్భంలో ఎలా వ్యవహరించాలి? వంటి విషయాలపై రెండు నెలలు శిక్షణ తీసుకొంది. తల్లి అయ్యే మహిళలు ఒప్పుకొంటే తమకు అభ్యంతరం లేదని వైద్యులు చెప్పడంతో అసలు సవాలు మొదలైంది. గర్భిణులను ఎంతో మందిని కలిసింది. తన ఉద్దేశాన్ని తెలిపింది. చాలా మంది వెనుకడుగువేశారు. పురుడుపోసుకోవడం ఎంతో పవిత్రమైంది. దాన్ని చిత్రీకరించ వద్దని తిరస్కరించారు. అయినా ప్రయత్నం ఆపలేదు. 2017 ఏప్రిల్లో ఎప్పటిలాగే ఆసుపత్రి వరండాలో నిలబడి ఉన్న ఉర్షిత వద్దకు ఓ గర్భిణి వచ్చింది. ఆమెతో పాటు ఆమె భర్త ఉన్నారు. అక్కడ చాలా రోజుల నుంచి ఉర్షిత ఎదురుచూస్తుండటం వారు గమనించారు. తన తపనను తెలుసుకున్నారు. ఒప్పుకున్నారు.
అలా మొదలైంది : ఆ రోజు వంద ఫొటోలతో మొదలైన ప్రయాణం అప్రతిహతంగా సాగుతూనే ఉంది. దిల్లీలోని 22 ఆసుపత్రుల్లో… దాదాపు 350 ప్రసవాలను తన కెమెరాలో ఇప్పటికే పదిలం చేసింది. ఆ మధుర క్షణాలను చిత్రాలుగా అందించినప్పుడు తల్లిదండ్రుల కళ్లలో కన్పించే ఆనందం ఎన్ని కోట్లు ఇచ్చినా రాదని చెబుతోంది ఉర్షిత.
ఈ వృత్తి ఎంత కఠినమైందో అంత అద్భుతమైంది. ఒకసారి ఆసుపత్రిలో 70గంటలు నిరంతరాయంగా ఉండాల్సి వస్తుంది. ఎక్కువ ప్రసవాలు అర్ధరాత్రి, తెల్లవారుజామునే జరుగుతాయి. ఏమాత్రం నిరుత్సాహ పడకుండా నెట్టుకురావాలి. ఈ ఒరవడిని త్వరలోనే ముంబయి, హైదరాబాద్కు విస్తరించడమే నా లక్ష్యం.
Courtesy Eenadu…